Leading News Portal in Telugu

Asia Cup 2023: శ్రీలంకలో భారీ వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం!


Asia Cup 2023 Super 4 games likely to be shifted: ఆసియా కప్‌ 2023కి పాకిస్థాన్‌, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాక్‌లో 4, లంకలో 9 మ్యాచ్‌లు నిర్వహించేలా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గ్రూప్‌ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే జరుగుతున్నా.. శ్రీలంకలోని మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. పల్లెకెలెలో శనివారం జరిగిన భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దయింది. రానున్న రోజుల్లో కొలొంబోలో భారీ వర్షాలు కురుస్తాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏసీసీ అప్రమత్తమైంది.

కొలంబోలో నిర్వహించాల్సిన ఐదు సూపర్‌ 4 మ్యాచ్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌ వేదికలను మార్చాలని ఏసీసీ ప్లాన్ చేస్తోందట. వేదికను కొలొంబో నుంచి డంబుల్లా లేదా హంబన్‌తోటకు మార్చాలని ఏసీసీ యోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డులతో ఏసీసీ చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొలంబోలో సెప్టెంబరు నుంచి సూపర్‌ 4 మ్యాచ్‌లు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ సెప్టెంబరు 17న కొలంబోలోనే జరగాల్సి ఉంది.