Leading News Portal in Telugu

Asia Cup 2023: పాకిస్తాన్ మమ్మల్ని బాగా చూసుకుంది: బీసీసీఐ అధ్యక్షుడు


BCCI President Roger Binny Said We received very good hospitality in Pakistan: పాకిస్థాన్‌లో లభించిన ఆప్యాయత, స్నేహపూర్వక ఆదరణ తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ తెలిపాడు. రెండు దేశాల మధ్య క్రికెట్‌ ఆట వారధిగా నిలుస్తుందని బీసీసీఐ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్‌ శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆహ్వానం మేరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను వీక్షించిన తర్వాత బిన్నీ, శుక్లా బుధవారం అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు తిరిగి వచ్చారు. గత 17 ఏళ్లలో ఇద్దరు బీసీసీఐ అధికారులు పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

‘పాకిస్తాన్‌లో మాకు మంచి ఆతిథ్యం లభించింది. వారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. క్రికెట్ మ్యాచులు చూడటం మరియు పాకిస్తాన్ బోర్డు అధికారులతో పలు విషయాలు చర్చించడమే ప్రధాన ఎజెండా. మొత్తంగా ఇది మంచి పర్యటన’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ‘పీసీబీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. భద్రత చాలా పటిష్టంగా ఉంది. ఏర్పాట్లు బాగున్నాయి. రెండు దేశాల మధ్య క్రికెట్‌ వారధిగా నిలుస్తుంది’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా అన్నారు.

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. రెండు దేశాలు ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్‌లలో మాత్రమే ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లింది. ఇక పాకిస్థాన్ చివరిసారిగా 2012లో భారత్‌ పర్యటనకు వచ్చింది. అప్పటినుంచి ఇండో-పాక్ ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి.