Leading News Portal in Telugu

Ind Vs Pak: నెట్స్‌లో కష్టపడుతున్న కేఎల్ రాహుల్.. డుమ్మా కొట్టిన రోహిత్, విరాట్..!


పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆసియా కప్‌-2023లో అడుగుపెట్టిన భారత జట్టుకు అడుగడుగునా వరణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా చిరకాల ప్రత్యర్థితో జరిగిన పోరులో 48.5 ఓవర్లలో రోహిత్‌ సేన 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే, ఎడతెరిపి లేని వర్షం కారణంగా పాకిస్తాన్‌కు బ్యాటింగ్‌ చేసే ఛాన్స్ రాలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను క్యాన్సిల్ చేయడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది.

ఈ క్రమంలో టీమిండియా తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడింది. ఈ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డు వచ్చాడు. వర్షం కారణంగా ఆగుతూ సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు డీఎల్‌ఎస్‌ పద్ధతిలో.. టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సూపర్‌-4లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి పాకిస్తాన్‌తో ఇండియా జట్టు తలపడేందుకు రెడీ అయింది. కొలంబోలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. కాగా తొలి మ్యాచ్‌లో పాక్‌ పేసర్ల నుంచి టీమిండియా బ్యాటర్లు గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌లో లోపాలు సవరించుకుని భారత్‌ పట్టుదలగా ఉంది.

అయితే, టీమిండియా ఆటగాళ్లు నేడు (గురువారం) ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఫిట్‌నెస్‌ సమస్యల నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెఫ్టార్మ్‌, రైటార్మ్‌ పేసర్ల బౌలింగ్‌ను అతడు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే.. మిగతా వాళ్లు కూడా కాసేపు ప్రాక్టీస్‌ చేయగా.. ఈ ఆప్షనల్‌ సెషన్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి డుమ్మా కొట్టారు. యువ ప్లేయర్స్ సైతం ప్రాక్టీసు​ చేస్తున్న టైంలో వీరిద్దరు రెస్ట్ తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంకొవైపు.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దగ్గరుండి మరీ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌ను గమనించినట్లు సమాచారం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు వీలుగా టీమ్ లోకి తీసుకున్న తరుణంలో అతడి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ మీద ద్రవిడ్ నజర్ పెట్టినట్లు టాక్.