Leading News Portal in Telugu

ODI World Cup 2023: ప్రపంచకప్‌ 2023లో ఆడే నెదర్లాండ్స్‌ జట్టు ఇదే.. ఆంధ్ర అబ్బాయికి చోటు!


Netherlands Squad for ICC ODI World Cup 2023: భారత గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌ 2023కి నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టుతో సహా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను ఎంపిక చేసింది. నెదర్లాండ్స్‌ జట్టును స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ నడిపించనున్నాడు. ఈ జట్టులో తెలుగు మూలాలున్న తేజ నిడమనూరుకు చోటు దక్కింది. విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో నెదర్లాండ్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ప్రపంచకప్‌ 2023 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. జింబాబ్వేను ఓడించిన డచ్‌ జట్టు.. తప్పక గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో అనూహ్యరీతిలో స్కాట్లాండ్‌పై గెలిచింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే స్కాట్లాండ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 44 ఓవర్లలో 278 పరుగులు చేయాలి. బాస్‌ డి లీడె, జుల్ఫికర్‌ చెలరేగడంతో నెదర్లాండ్స్‌ మరో 7 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది.

స్కాట్లాండ్‌పై అనూహ్య విజయంతో ఐదోసారి వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో నెదర్లాండ్స్‌ అడుగుపెట్టింది. భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌ 2011లో బరిలోకి దిగిన డచ్‌ జట్టు.. మళ్లీ భారత్‌లోనే జరగనున్న ప్రపంచకప్‌ 2203లో బరిలోకి దిగనుండటం విశేషం. అక్టోబర్‌ 6న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నెదర్లాండ్స్‌ తలపడనుంది. హైదరాబాద్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఇక నవంబర్‌ 11న బెంగళూరులో భారత్‌ను డచ్‌ జట్టు ఢీకొట్టనుంది.

నెదర్లాండ్స్‌ జట్టు:
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కొలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బారెసి, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఎస్ఏ ఎంగెల్బ్రెచ్ట్, ర్యాన్ క్లెయిన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, తేజ నిడమనూరు, మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్.