Leading News Portal in Telugu

T20 World Cup 2024: ఐసీసీ కీలక ప్రకటన.. అమెరికాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు


ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) మెన్స్‌ వరల్డ్‌కప్‌-2024 కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. న్యూయార్క్‌, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్‌ వేదికలుగా ఎంపిక చేసినట్లు నేడు (బుధవారం ) ఐసీసీ ధ్రువీకరించింది. కాగా వెస్టిండీస్‌తో కలిసి యునైటైడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా ఈసారి టీ20 ప్రపంచకప్‌ నిర్వహణకు రెడీ అయింది. మొట్ట మొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను అమెరికా దక్కించుకోవడంతో.. వేదికల ఎంపికలో తుది నిర్ణయం తీసుకుంది.

అయితే, న్యూయార్క్‌లోని నసౌవ్‌ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రొవార్డ్‌ కౌంటీ అసోసియేషన్‌లకు ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఐసీసీ ఆదేశించింది. సీటింగ్‌ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గాఫ్‌ అలార్డిస్‌ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ టోర్నమెంట్ కు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం హ్యాపీగా ఉందన్నారు. అమెరికాలో క్రికెట్‌ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుంది.. ఫ్యాన్‌బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు.

ఇక, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సొంత నగరాల్లోనే మేటి క్రికెట్‌ మ్యాచ్‌లు నేరుగా చూసేందుకు యూఎస్‌ఏలోని క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఛాన్స్ కల్పించడం పట్ల గాఫ్ అలార్డిస్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత టీ20 ప్రపంచకప్‌-2024 రూపంలో మరోసారి క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత వినోదం అందనుంది. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ జట్టు విజేతగా నిలిచింది.