Moin Khan Slams Pakistan players ahead of ICC Cricket World Cup 2023: భారత్తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్ ఆజమ్కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదని, ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమే అని మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఏకంగా 228 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక మ్యాచ్లోనూ ఓడిపోయి విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ప్రదర్శనపై మొయిన్ ఖాన్ స్పందించాడు.
మొయిన్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ… ‘కెప్టెన్ బాబర్ ఆజమ్కు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ సలహాలు ఇవ్వడానికి భయపడ్డారు. రిజ్వాన్, షాదాబ్, ఫఖర్, షాహిన్.. వీళ్లంతా బాబర్కు సలహాలు ఇవ్వలేకపోయారు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదు. గేమ్ ప్లాన్ గురించి ఆటగాళ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ సీనియర్లు సలహాలు ఇచ్చినా.. వాటిని పాటించడం లేదేమో. ఎందుకో తెలియదు కానీ.. భారత్తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు’ అని అన్నాడు.
‘తాము ఇచ్చిన సలహాలు పనిచేయకపోతే.. మ్యాచ్ ఫలితం గురించి చింతించక తప్పదనే ఆందోళన సీనియర్లలో కనిపిస్తోంది. ఓ పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఇలాంటి భయాలు సహజమే. అయితే పూర్తి స్థాయిలో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు ఆటగాళ్లు ప్రదర్శించాలి. ప్రతికూల ఫలితం వస్తుందనే భయం ఉన్నా.. బాడీ లాంగ్వేజ్లో దాన్ని కనిపించకుండా జాగ్రత్త పడాలి. ప్రపంచకప్ ఉంది. ఇప్పటికైనా అందరూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే మంచిది’. భారత్తో మ్యాచ్ మిగతా మ్యాచ్ లానే ఆడితే ఒత్తిడి అధిగమించొచ్చు’ అని మొయిన్ ఖాన్ సూచనలు చేశాడు. అక్టోబరు 14న భారత్తో పాకిస్తాన్ తలపడనుంది.