Leading News Portal in Telugu

ODI World Cup 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. భారత్‌కు భారీ షాక్‌! ఓపెనర్‌గా ఇషాన్


Shubman Gill tests positive for dengue ahead of IND vs AUS Match: భారత గడ్డపై ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 గురువారం ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. నేడు హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ తలపడనుండగా.. ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

శుబ్‌మన్‌ గిల్‌ డెంగ్యూతో బాధపడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. గిల్‌కు తాజాగా డెంగ్యూ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువ ఓపెనర్ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడట. గిల్‌కు నేడు మరోసారి రక్త పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఫలితాలను బట్టి భారత టీమ్ మేనెజ్‌మెంట్‌ ఓ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు పలు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. యువ ఓపెనర్ గిల్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

శుబ్‌మన్‌ గిల్‌ డెంగ్యూతో బాధపడుతున్నట్లు బీసీసీఐ ఇంకా ధ్రువీకరించలేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండాలి కాబట్టి అతడు కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ గిల్‌ దూరమైతే ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గిల్‌ ప్రస్తుతం అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌ 2023తో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో కూడా పరుగుల వరద పారించాడు. ఈ నేపథ్యంలో ఒకవేళ గిల్‌ దూరమైతే.. భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.