Leading News Portal in Telugu

Pant-Axar: శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్స్ పంత్‌, అక్షర్‌!


Pant-Axar: శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్స్ పంత్‌, అక్షర్‌!

Rishabh Pant, Axar Patel Visits Tirupati Balaji Temple Today: భారత వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ ఇద్దరు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఆలయ అధికారులు పంత్‌, అక్షర్‌కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన రిషబ్ పంత్, అక్షర్‌ పటేల్‌లతో ఫొటోలు దిగేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాంతో ఆలయం వెలుపల సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక గాయాల కారణంగా పంత్‌, అక్షర్‌లు ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నారు. గతేడాది చివరలో కారు ప్రమాదంలో గాయపడిన పంత్ ఇప్పుడు కోలుకుంటున్నాడు. మరోవైపు వరల్డ్‌కప్‌ 2023కు ఎంపికయ్యాక అక్షర్‌ గాయపడ్డాడు.

వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి.. అన్ని జట్ల కంటే ముందే సెమీస్‌కు అర్హత సాధించింది. లీగ్‌ దశలో భారత్‌ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక్క దాంట్లో గెలిచినా టీమిండియా అగ్రస్థానంను ఏ టీమ్ కూడా కొట్టలేదు. మంచి దూకుడుమీదున్న భారత్ కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.