Leading News Portal in Telugu

IND vs BAN: టీమిండియా కెప్టెన్‌తో బంగ్లాదేశ్‌ క్రికెటర్ల గొడవ.. కొట్టుకునేంత పని చేశారు!


IND vs BAN: టీమిండియా కెప్టెన్‌తో బంగ్లాదేశ్‌ క్రికెటర్ల గొడవ.. కొట్టుకునేంత పని చేశారు!

India and Bangladesh players involved in heated argument: సీనియర్‌లు అయినా, జూనియర్‌లు అయినా.. ప్రత్యర్థి ఆటగాళ్లతో మైదానంలోనే గొడవలకు దిగడం బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు ఓ అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన బంగ్లా ప్లేయర్స్.. తాజాగా భారత ఆటగాళ్లతో గొడవ పడ్డారు. అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొడవ పెట్టుకున్నారు. ఓ దశలో కొట్టుకునేంత పని చేశారు. అంపైర్‌ జోక్యం చేసు​కోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబదించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అర్షిన్ కులకర్ణి (7), ముషీర్ ఖాన్ (3) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఓపెనర్ ఆదర్శ్‌ సింగ్‌ (76; 96 బంతుల్లో 6×4), కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ (64; 94 బంతుల్లో 4×4) జట్టును ఆదుకున్నారు. ఆదర్శ్ దూకుడుగా ఆడుతూ 67 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు సహారన్ కూడా హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. వికెట్ పడకపోవడంతో బంగ్లాదేశ్ ప్లేయర్స్ అసహనానికి గురయ్యారు. దాంతో టీమిండియా కెప్టెన్ సహారన్‌తో మాటల యుద్ధానికి దిగారు.

భారత ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఉదయ్‌ సహారన్‌తో బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాం మాటల యుద్ధానికి దిగాడు. ఆ తర్వాత కూడా బంగ్లా ఆటగాళ్లు.. భారత బ్యాటర్లను కవ్వించే ప్రయత్నం చేశారు. దీంతో భారత బ్యాటర్లు కూడా ధీటుగా బదులిచ్చారు. ఇస్లాంకు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ మద్దతుగా నిలవడంతో వాగ్వాదం తీవ్రమైంది. ఒకరికొకరు దగ్గరకు వచ్చి.. కొట్టుకునేంత పనిచేశారు. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్లు వారిని అడ్డుకున్నారు. వవ గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ 84 పరుగుల తేడాతో విజయం సాదించింది.