Leading News Portal in Telugu

IND vs ENG: టెస్టు క్రికెట్‌ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి: సర్ఫరాజ్‌


IND vs ENG: టెస్టు క్రికెట్‌ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి: సర్ఫరాజ్‌

Sarfaraz Khan Interview video: తొలి టెస్టులో రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయపడటంతో.. వారి స్థానాల్లో సర్ఫరాజ్‌ ఖాన్, వాషింగ్టన్‌ సుందర్‌, సౌరభ్‌ కుమార్‌లకు బీసీసీఐ జట్టులో చోటిచ్చింది. అంతకంటే ముందు విరాట్ కోహ్లీ స్థానంలో మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ ఎంపికయ్యాడు. రెండో టెస్టులో మిడిలార్డర్‌లో చోటు కోసం పాటిదార్‌తో సర్ఫరాజ్‌ పోటీపడ్డాడు. అయితే నేడు ఆరంభం అయిన విశాఖ టెస్టు తుది జట్టులో పాటిదార్‌కు స్థానం దక్కడంతో.. సర్ఫరాజ్‌కు నిరాశే ఎదురైంది. దాంతో సర్ఫరాజ్‌ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చుస్తున్నారు. ఈ సమయంలో బీసీసీఐకి సర్ఫరాజ్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ అయింది.


సర్ఫరాజ్‌ ఖాన్‌ వీడియోలో మాట్లాడుతూ… ‘టెస్టు క్రికెట్‌ ఆడాలంటే ఎంతో ఓపిక అవసరం. కొన్నిసార్లు మనం తొందరపాటులో పనులు చేస్తూ ఉంటాం. నేను కూడా వీలైనంత త్వరగా టీమిండియాలో అడుగుపెట్టాలని ఎదురుచూసేవాడిని. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి కూడా లోనయ్యేవాడిని. అప్పుడు మా నాన్న సర్దిచెప్పేవారు. ”ఎప్పుడూ హార్డ్‌వర్క్‌ చేస్తే.. కచ్చితంగా ఫలితం వస్తుంది. అప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు అని చెబుతుంటారు” అని తెలిపాడు.

‘ఆత్మ విశ్వాసం, ఓపిక కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని తెలుసుకున్నా. భారత జట్టులో చోటు దక్కడంతో మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న దేశంలో టీమిండియాలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల నాకు గర్వంగా ఉంది. అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటా’ అని సర్ఫరాజ్‌ ఖాన్‌ చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్టులో పరాజయం పాలైన భారత్.. విశాఖపట్నం టెస్ట్ గెలవాలని చూస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలైంది.