Leading News Portal in Telugu

Shreyas Iyer-BCCI: బీసీసీఐ హెచ్చరిక.. దిగొచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌!



Shreyas Iyer

Shreyas Iyer included Mumbai Squad for Ranji Trophy 2024: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) హెచ్చరికతో టీమిండియా ఆటగాళ్లు దారిలోకి వస్తున్నారు. వెన్ను నొప్పిని సాకుగా చూపుతూ.. రంజీల్లో ఆడకుండా తప్పించుకు తిరుగుతున్న టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్లో ఆడనున్నాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి ముంబై సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. బీసీసీఐ కాంట్రాక్ట్‌ రద్దు ప్రచారం నేపథ్యంలో అతడు అలర్ట్‌ అయ్యాడు.

వెన్ను గాయం, ఫామ్‌తో తంటాలు పడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ను ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. భారత్ ఆటగాళ్లు జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ ఆదేశించినా.. శ్రేయస్‌ విస్మరించడం భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ను బోర్డు తప్పించనుందని వార్తలొచ్చాయి. వెన్ను గాయం కారణంతో శ్రేయస్‌ రంజీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యాడు. అయితే శ్రేయాస్ ఫిట్‌గా ఉన్నాడని ఎన్‌సీఏ వైద్య బృందం బీసీసీఐ సెలక్టర్లకు లేఖ రాశారు. దాంతో బీసీసీఐ అతడిపై సీరియస్ అయింది. చివరకు శ్రేయస్‌ రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.

Also Read: OnePlus Watch 2 Price: ‘వన్‌ప్లస్‌ వాచ్‌ 2’ వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్‌!

మరోవైపు వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా తిరిగొచ్చిన ఇషాన్ కిషన్‌ కూడా దేశవాళీ బాట పట్టాడు. డీవై పాటిల్‌ టీ20 మ్యాచ్‌లో ఆర్‌బీఐ తరఫున బరిలో దిగిన ఇషాన్.. 12 బంతుల్లో 19 పరుగులు చేశాడు. రంజీల్లో ఆడే విషయంలో ఇషాన్‌ కూడా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన విషయం తెలిసిందే. కుర్రాళ్లు ఐపీఎల్‌పై ఆసక్తితో దేశవాళీ క్రికెట్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని భావిస్తోన్న బీసీసీఐ.. దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా నిబంధన తీసుకురావాలని చూస్తోంది. అంతేకాదు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడినవారికి నగదు ప్రోత్సాహకం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.