
Babar Azam, David Warner unsold in The Hundred 2024 Draft: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్లకు మరోసారి చుక్కెదురైంది. ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్’ 2024 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఈ ఇద్దరు పాక్ ఆటగాళ్లు అన్సోల్డ్గా మిగిలిపోయారు. ది హండ్రెడ్ లీగ్లో వరుసగా మూడోసారి బాబర్, రిజ్వాన్లు అమ్ముడుపోకపోవడం విశేషం. ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో అమ్ముడపోలేదు.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్, ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్, ఆస్ట్రేలియా హిట్టర్ టిమ్ డేవిడ్లు సైతం ది హండ్రెడ్ 2024 వేలంలో అమ్ముడు పోలేదు. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, ఇమాద్ వసీంలు అమ్ముడుపోయారు. ఆఫ్రిదీని లక్ష పౌండ్లకు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు అతడికి దక్కనున్నాయి. గత సీజన్లో కూడా వెల్ష్ ఫైర్ ప్రాంచైజీకే ఆఫ్రిదీ ప్రాతినిథ్యం వహించాడు. నసీం షాను బర్మింగ్హామ్ ఫీనిక్స్.. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్ కైవసం చేసుకున్నాయి.
Also Read: Vivo T3 5G Launch: వివో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!
వెస్టిండీస్ ప్లేయర్స్ నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్మైర్, కీరన్ పొలార్డ్, రోవ్మాన్ పావెల్ వంటి విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్లోనే అమ్ముడుపోయారు. మరోవైపు మహిళల ది హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్లో భారత స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, రిచ్ ఘోష్లను చోటు దక్కింది. మంధానను సదరన్ బ్రేవ్.. రిచా ఘోష్ను బర్మింగ్హామ్ ఫీనిక్స్ కొనుగోలు చేసింది. ఈ ఇద్దరు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.