- డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక
- వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు
- సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ

గాయాల కారణంగా ఆటకు దూరమై.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. భారత క్రికెటర్లు తమ ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకోవాలంటే.. డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా పేర్కొన్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్ర జడేజా గాయంను గుర్తుచేశారు.
‘రెండేళ్ల క్రితం రవీంద్ర జడేజాకు గాయం అయింది.కోలుకున్న తరువాత దేశవాళీలో ఆడమని నేనే కోరా. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేశాం. క్రికెటర్ల విషయంలో మేం స్ట్రిక్ట్గా ఉందామనుకున్నాం. ఎవరైనా గాయాలకు గురై విరామం తీసుకొని.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని భావిస్తే ఫిట్నెస్ నిరూపించుకోవాలి. వారు దేశవాళీ క్రికెట్ను వేదికగా చేసుకోవాలి. విరాట్, రోహిత్, బుమ్రా వంటి టాప్ క్రికెటర్లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. దేశవాళీలో ఆడుతూ గాయపడితే జట్టుకు చాలా నష్టం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టాప్ క్రికెటర్లు ఆడటం మనం చూడలేదు. మన ప్లేయర్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే గాయపడిన వారి పరిస్థితి వేరు’ అని జై షా చెప్పారు.
సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్లెన్లుగా వ్యవహరిస్తారు. దాదాపు అందరు భారత క్రికెటర్స్ ఈ టోర్నీలో ఆడుతున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా ఆడనున్నాడు. కోహ్లీ, రోహిత్ , బుమ్రా, అశ్విన్లు టోర్నమెంట్ మొదటి రౌండ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది.