Leading News Portal in Telugu

Rohit Sharma Fitness: ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా.. రోహిత్‌ శర్మ ఘాటు వ్యాఖ్యలు!


  • రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై ట్రోల్స్
  • రోహిత్‌ ఘాటు వ్యాఖ్యలు
  • వచ్చే ఏడాది 500 మార్క్
Rohit Sharma Fitness: ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా.. రోహిత్‌ శర్మ ఘాటు వ్యాఖ్యలు!

Rohit Sharma React About Fitness Critics: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ఆటతో పాటుగా ఫిట్‌నెస్‌ పరంగానూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. లావుగా ఉన్నాడని, పొట్ట వచ్చేసిందని.. చాలాసార్లు రోహిత్‌ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వడా పావ్, సాంబార్ అంటూ తరచూ ట్రోల్స్‌కి గురవుతుండేవాడు. తాజాగా ఈ విమర్శలపై రోహిత్‌ ఘాటుగా స్పందించాడు. తాను 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయికి చేరువలో ఉన్నానని, ఫిట్‌నెస్‌ లేకుండానే ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా అంటూ ప్రశ్నించాడు.

ఓ యూట్యూబ్‌ పాడ్‌కాస్ట్‌లో జితేంద్ర చౌక్సేతో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ… ’17 ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతున్నా. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లకు చేరువ కావడం చిన్న విషయం కాదు. చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే ఈ మైలురాయి అందుకున్నారు. సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే.. జీవన శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఫిట్‌నెస్‌ చూసుకోవడం, మెదడును నియంత్రణలో ఉంచుకోవడం.. ఇలా చాలా విషయాలు ఉంటాయి. మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యామనేది అన్నింటిలోకెల్లా ముఖ్యమైంది. మ్యాచ్‌ కోసం 100 శాతం సిద్ధంగా ఉండి విజయం సాధించేందుకే కృషి చేయాలి. వీటి వెనకాల ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కీలక పాత్ర పోషిస్తుంది’ అని అన్నాడు.

ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకూ కేవలం 10 మంది మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. సచిన్, ధోనీ, కోహ్లీ, ద్రవిడ్ 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ప్రస్తుతం రోహిత్ శర్మ 485 మ్యాచ్‌లతో ఆ మైలురాయికి చేరువగా ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్.. టెస్ట్, వన్డేల్లో కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది 500 మార్క్ అందుకునే అవకాశం ఉంది.