Leading News Portal in Telugu

IND vs ENG 1st ODI: India Clinches Victory in the First ODI


  • తొలి వన్డేలో భారత్ ఘన విజయం..
  • 4 వికెట్ల తేడాతో గెలుపు
  • హాఫ్ సెంచరీలతో రాణించిన గిల్ (87), శ్రేయాస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52)
  • 1-0 ఆధిక్యంలో భారత్.
IND vs ENG 1st ODI: తొలి వన్డేలో భారత్ ఘన విజయం..

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత జట్టు 248 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా అదరగొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వరుసగా 19 పరుగుల వద్ద పెవిలియన్‌కు వెళ్లిపోయారు. అయితే.. శ్రేయాస్ అయ్యర్ (36 బంతుల్లో 59), శుభ్‌మన్ గిల్ (87) మధ్య 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇండియా జట్టుకు విజయపు దిశగా తీసుకెళ్లారు. మిడిలార్డర్‌లో అక్షర్ పటేల్ 52 పరుగులు చేశాడు. దీంతో.. 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో చేధించి టీమిండియా విజయం సాధించింది.

అంతకుముందు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు 70కి పైగా పరుగులు సాధించినప్పటికీ, తొలి వికెట్ పడగానే వికెట్ల పతనం ప్రారంభమైంది. మొదటి వికెట్ 75 పరుగుల వద్ద పడింది. ఆ తరువాత 77 వద్ద మూడు వికెట్లు పడిపోయాయి. దీంతో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51), ఫిల్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌లో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తలో ఒక్కొక్క వికెట్ సంపాదించారు. కాగా.. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండవ వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుంది.