- దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
- టీమిండియాకు పలు సూచనలు చేసిన సునీల్ గవాస్కర్..
- ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు: గవాస్కర్

Sunil Gavaskar: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ ఫైనల్ మ్యా్చ్ లో న్యూజిలాండ్ను ఢీ కొట్టనుంది భారత్. ఇక, తుది జట్టు ఎలా ఉండబోతుందని అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదన్నారు. గత రెండు మ్యాచుల్లో బరిలోకి దిగినట్లే నలుగురు స్పిన్నర్లు, ఇద్దర్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. కానీ, కొన్ని అంశాల్లో రోహిత్ సేన మెరుగైతే ఫైనల్లో తిరుగుండదన్నాడు. ఇప్పటి వరకు భారత జట్టుకు ఓపెనర్ల నుంచి భారీ ఆరంభం రాలేదన్నాడు.. ఫైనల్లో వస్తుందని అనుకుంటున్నాను.. ఈ విషయంలో ఓపెనర్లు మెరుగవ్వాల్సి ఉంది.. ఇక, కొత్త బంతితోనూ ఆరంభంలో ఇంకొన్ని వికెట్లు తీసుకోవాలి.. కనీసం 2 నుంచి 3 వికెట్లు తీస్తే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది.. దీంతో పాటు మిడిల్ ఓవర్లలో పరుగులు ఆపుతున్నప్పటికీ వికెట్లు పడగొడితే ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని సునీల్ గవాస్కర్ వెల్లడించారు.
ఇక, టీమిండియా రెండు విభాగాల్లో ఇంప్రూవ్ కావాలి అని సునీల్ గవాస్కర్ సూచించారు. అప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మనకు ఈజీ అవుతుందన్నాడు. భారత్ తుది జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండటంతో బౌలింగ్ ప్రభావవంతంగా మారిందన్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్లను తుది జట్టులోకి తీసుకోవడం మేనేజ్మెంట్ మంచి నిర్ణయం అన్నారు. వికెట్లు తీయడమే కాకుండా.. డాట్ బాల్స్ను వేయడం పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత కీలకం అన్నారు. వారిద్దరూ ఆ విషయంలో చాలా బెటర్ అని చెప్పుకొచ్చారు. గ్రూప్ స్టేజ్లో ఇప్పటికే న్యూజిలాండ్ పై స్పిన్నర్లు చక్కని ప్రదర్శన కనబరిచారు.. దుబాయ్ పిచ్ నుంచి మంచి స్పిన్నర్లకు సహకారం అందుతోంది. అలాంటప్పుడు భారత్ ఫైనల్ XIలో ఎలాంటి మార్పులు చేయకుండానే రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.