- రేపు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
- ఫైనల్ పోరులో తలపడబోతున్న భారత్- న్యూజిలాండ్ జట్లు..
- విజేతగా నిలిచేందుకు నెట్స్ లో చెమటోడుస్తున్న ఇరు జట్లు..

IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తుంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగకుండా అజేయంగా దూసుకెళుతుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఎదుర్కొనుంది. ఇక, భారత, న్యూజిలాండ్ క్రికెటర్లు నెట్స్ లో చెమటోడుస్తున్నారు. ఐసీసీ మెగాటోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్లో రోహిత్ సేన మునిగి తేలింది. కాగా, లీగ్ దశలో న్యూజిలాండ్ను ఓడించిన టీమిండియా అదే రీతిలో ఆదివారం జరిగే ఫైనల్ పోరులోనూ సత్తాచాటాలని భావిస్తుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశం.
అయితే, దుబాయ్ పరిస్థితులు న్యూజిలాండ్ జట్టుకు కొత్తగా ఉన్నాయి. ఇక, రెండు జట్ల బలబలాల పరంగా చూస్తే సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ రోజు అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కానీ, టీమ్ ఫామ్ చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కివీస్ కంటే మెరుగ్గా భారత్ కనిపిస్తుంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా.. మ్యాచ్ స్వరూపం మారిపోవడం ఖాయం అని చెప్పాలి. అలాగే, కివీస్ విషయానికొస్తే.. రచిన్ రవీంద్ర, విలియమ్సన్ సూపర్ ఫాంలో ఉన్నారు. హెన్రీ గాయం ఆ జట్టును కాస్తా కలవరపెడుతుంది.