Leading News Portal in Telugu

Virat Kohli on the Verge of Breaking a Rare Record, Surpassing Cricket Legends!


  • ఈరోజు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్
  • మధ్యాహ్నం 2.30 గం.కు మ్యాచ్
  • ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం.
Virat Kohli: అరుదైన రికార్డుకు దగ్గరలో కోహ్లీ.. మాజీ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి..!

ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఈరోజు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ పాకిస్తాన్‌పై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్‌లో 84 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

వన్డేల్లో పెద్ద రికార్డు సాధించడానికి విరాట్ కోహ్లీకి 55 పరుగులు అవసరం. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో.. కోహ్లీ, కుమార్ సంగక్కరను అధిగమించి రెండవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఫైనల్లో 55 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా అవతరిస్తాడు. కుమార్ సంగక్కర 404 మ్యాచ్‌లలో 14234 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అతను 463 మ్యాచ్‌లలో 18426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 301 మ్యాచ్‌లలో 14180 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో 16 పరుగుల తేడాతో సెంచరీ మిస్ కాకపోతే అది కోహ్లీ 25వ వన్డే సెంచరీ అయ్యేది.

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు:
సచిన్ టెండూల్కర్ – 18426
కుమార్ సంగక్కర – 14234
విరాట్ కోహ్లీ – 14180
రికీ పాంటింగ్ – 13704
సనత్ జయసూర్య – 13430