- రిటైర్మెంట్ వార్తలపై రవీంద్ర జడేజా ఫైర్
- హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా?
- అనవసర వదంతులు వద్దు

టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో జడేజా తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడమే ఇందుకు కారణం. రిటైర్మెంట్ వార్తలపై జడ్డు ఫైర్ అయ్యాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా? అని మండిపడ్డాడు. దయచేసి పుకార్లు పుట్టించకండి అని జడేజా కోరాడు.
ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు సీనియర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురి వయసు 35 దాటేసింది. టీ20 ప్రపచకప్ 2024 గెలిచిన అనంతరం పొట్టి ఫార్మాట్కు అల్విదా పలికారు. వన్డే ప్రపంచకప్ 2027లో ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వీరు రిటైర్మెంట్ ప్రకటించచే అవకాశం ఉందని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ.. ఫైనల్లో జడేజా వ్యవహరించాడు. ఫైనల్లో తన 10 ఓవర్ల కోటా ముగిసిన వెంటనే కోహ్లీని హగ్ చేసుకున్నాడు. దాంతో జడ్డు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ వార్తలను జడేజా ఖండించాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ ఇస్తున్నట్లా అని ప్రశ్నించాడు?. ‘అనవసర వదంతులు వద్దు’ అని జడేజా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ వార్తలకు తెరదించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తనకు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఉద్దేశం లేదన్నాడు. టీమిండియా మంచి స్థానంలో ఉన్నప్పుడే తాను వీడ్కోలు పలుకుతానని విరాట్ చెప్పాడు. దాంతో వన్డేల్లో ఈ ముగ్గురు మరికొన్నాళ్లు కొనసాగనున్నారు. ప్రపంచకప్ 2027 వరకు ముగ్గురు కొనసాగే అవకాశం ఉంది. మరో రెండేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు.