Leading News Portal in Telugu

Punjab Kings Put Huge Hopes on Shreyas Iyer in IPL 2025


  • ఆరంభ సీజన్‌లో సెమీస్ చేరిన పంజాబ్‌
  • 2014లో ఫైనల్‌ చేరిన పంజాబ్‌
  • ఆశలు రేకెత్తిస్తున్న కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌
IPL 2025: ఆశలు రేకెత్తిస్తున్న కొత్త కెప్టెన్‌.. ఈసారి పంజాబ్‌ రాత రానేనా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కప్ కొట్టని జట్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా.. ఇప్పటివరకు టైటిల్ ముద్దాడలేదు. ఆరంభ సీజన్‌లో సెమీస్ చేరిన పంజాబ్‌.. 2014లో ఫైనల్‌ చేరి కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ఈ రెండు ప్రదర్శనలు మినహాయిస్తే.. మరోసారి కనీసం లీగ్‌ దశను కూడా దాటలేకపోయింది. ప్రాంచైజీ పేరు మార్చినా, వేర్వేరు కెప్టెన్లను ప్రయత్నించినా ఫలితం మాత్రం లేకపోయింది. ఇటీవలి సీజన్లలో పేలవ ప్రదర్శన కారణంగా.. సగటు అభిమానికి ప్లేఆఫ్స్‌ అంచనాలు కూడా పంజాబ్‌ జట్టుపై లేకుండా పోయాయి. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో జట్టులో జరిగిన భారీ మార్పులు పంజాబ్‌ రాత మారేలా కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2024లో కోల్‌కతాకు టైటిల్‌ అందించిన భారత స్టార్ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ పంజాబ్‌ కింగ్స్‌ జట్టులోకి వచ్చాడు. వేలంలో అతడిని రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ పంజాబ్‌ జట్టు యజమానుల ఆశలు రేకెత్తిస్తున్నాడు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. గత ఏడాది కోల్‌కతా కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టడం ఒకటైతే.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో సూపర్‌ ఫామ్‌లో ఉండడం రెండోది. ఫామ్ లేమితో తంటాలు పడిన సమయంలో దేశవాళీల్లో రాణించి.. భారత జట్టులోకి వచ్చాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ని భారత్ గెలవడంలో శ్రేయస్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న శ్రేయస్‌.. పంజాబ్ జట్టును ముందుండి నడిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సహచరుల నుంచి మంచి ప్రదర్శన రాబట్టడం శ్రేయస్‌ ప్రత్యేకత.

పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో మంచి విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోస్‌ ఇంగ్లిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆరోన్‌ హార్డీ, లాకీ ఫెర్గూసన్, జేవియర్ బార్ట్‌లెట్‌ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పంజాబ్‌కు పేరున్న స్వదేశీ ప్లేయర్స్ తక్కువగా ఉన్నారు. శ్రేయస్‌ అయ్యర్‌, అర్ష్‌దీప్‌ సింగ్, యుజ్వేంద్ర చహల్ తప్ప స్టార్‌ ఆటగాళ్లెవ్వరూ లేరు. వైశాఖ్‌ విజయ్‌కుమార్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, శశాంక్‌ సింగ్, నెహాల్‌ వదేరా, యశ్‌ ఠాకూర్, ముషీర్‌ ఖాన్, హర్‌ప్రీత్‌ బ్రార్ లాంటి యువకులు జట్టులో ఉన్నారు. కెప్టెన్ వీరిని సరైన సమయంలో ఉపయోగించుకుంటే.. పంజాబ్‌ ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉంటాయి.

పంజాబ్‌ కింగ్స్‌ టీమ్:
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోస్‌ ఇంగ్లిస్, అర్ష్‌దీప్‌ సింగ్, యుజ్వేంద్ర చహల్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, శశాంక్‌ సింగ్, నెహాల్‌ వదేరా, వైశాఖ్‌ విజయ్‌కుమార్, యశ్‌ ఠాకూర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, విష్ణు వినోద్, హర్నూర్‌ పన్ను, పైలా అవినాష్, హర్‌ప్రీత్‌ బ్రార్, ఆరోన్‌ హార్డీ, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్‌ ఆర్య, ముషీర్‌ ఖాన్, మార్కో జాన్సెన్, సూర్యాంశ్‌ షెగ్డే, జేవియర్ బార్ట్‌లెట్‌, కుల్‌దీప్‌ సేన్, ప్రవీణ్‌ దూబె.