Leading News Portal in Telugu

Is Rohit Sharma to decide on Test Retirement after IPL 2025


  • ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు
  • ఐపీఎల్‌ 2025 తర్వాత టెస్ట్ రిటైర్‌మెంట్‌పై నిర్ణయం
  • 2027 నాటికి 40 ఏళ్లు
Rohit Sharma: ఐపీఎల్‌ 2025 తర్వాతే రోహిత్ శర్మ నిర్ణయం!

ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డేలకూ గుడ్‌బై చెబుతాడని అంతా భావించారు. అయితే తాను రిటైర్‌మెంట్ తీసుకోవడం లేదంటూ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రెండేళ్ల పాటు హిట్‌మ్యాన్ కొనసాగే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ 2027, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్‌లోనూ ఆడతాడని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్ తన కల అని రోహిత్ చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రోహిత్ శర్మ వచ్చే నెల 23న 38వ పడిలోకి అడుగుపెడతాడు. 2027 నాటికి 40 ఏళ్లు వస్తాయి. అప్పటివరకు రోహిత్ జట్టులో కొనసాగాలంటే.. ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌తో పాటు బ్యాటింగ్‌లో ఫామ్‌ కీలకం. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి ఫిట్‌నెస్‌ కోసం రోహిత్ పనిచేయనున్నట్లు సమాచారం. రోహిత్ వన్డే భవితవ్యంపై ఓ క్లారిటీ ఉన్నా.. టెస్టు భవిష్యత్తుపై మాత్రం క్లారిటీ రాలేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2025లో రోహిత్ విఫలమయ్యాడు. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పేలవ ఫామ్ కారణంగా.. చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత టెస్టు కెరీర్‌పై రోహిత్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి హిట్‌మ్యాన్ టెస్టులు ఆడుతాడో లేదో.