Leading News Portal in Telugu

BCCI Showers ₹58 Crore Cash Reward on Team India After Champions Trophy Victory


  • టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా
  • రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్న బీసీసీఐ
  • ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ప్రైజ్ మనీ.
Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. అయితే ఎవరికెంత మొత్తం లభిస్తుందో బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ విజయాన్ని భారత క్రికెట్ కోసం గర్వించదగిన ఘట్టంగా అభివర్ణించారు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలుచుకోవడం ప్రత్యేకమైన విషయమని.. ఇది టీమిండియా నిబద్ధత, ప్రతిభకు గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు. భారత క్రికెట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఈ విజయం మరోసారి రుజువు చేసిందని బిన్నీ తెలపారు. 2025లో టీమిండియా గెలుచుకున్న ఇది రెండవ ఐసీసీ ట్రోఫీ.. గతంలో అండర్-19 మహిళల జట్టు కూడా ప్రపంచకప్‌ను గెలుచుకుందని అన్నారు. ఇది దేశంలోని క్రికెట్ అభివృద్ధికి బలమైన ఉదాహరణ అని బిన్నీ పేర్కొన్నారు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి, వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత.. పాకిస్థాన్‌ను కూడా అదే తేడాతో ఓడించింది. న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ స్టేజ్‌ను విజయవంతంగా ముగించింది. సెమీ-ఫైనల్లో, ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.. కాగా, ఐసీసీ ప్రైజ్ మనీ (రూ.19.50+కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం.