Leading News Portal in Telugu

IPL 2025 Opening Match Faces Rain Threat in Kolkata, IMD Warns of Thunderstorms and Heavy Rain.


  • ఐపీఎల్ 2025 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూపులు
  • మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభ మ్యాచ్
  • కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య పోరు
  • ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు ఉందన్న వాతావరణ శాఖ.
IPL 2025: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఓపెనింగ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. అలీపోర్ వాతావరణ శాఖ (IMD) తాజా నివేదిక ప్రకారం.. మార్చి 20 నుంచి 22 మధ్య పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉంది. కోల్‌కతాలో కూడా భారీ వర్షం కురిసే సూచనలు ఉండటంతో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది.

IMD ప్రకారం.. బిర్భూమ్, ముర్షిదాబాద్, నాడియా, తూర్పు బంధమాన్, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. దీని వల్ల కోల్‌కతా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు.. ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుక కూడా గ్రాండ్‌గా జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటాని, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాల్గొని తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారు. అయితే, వర్షం కారణంగా ఈ వేడుక కూడా జరుగుతుందా లేదా అనేది చెప్పలేం.

మ్యాచ్ రద్దు అయితే?
వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. రెండు జట్లు పాయింట్లను సమంగా పంచుకుంటాయి. వర్షం పడి ఆగిపోతే DLS (డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్) పద్ధతి ప్రకారం ఓవర్ల సంఖ్య తగ్గించవచ్చు.
తుది నిర్ణయం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.