Leading News Portal in Telugu

Team India head coach Gautam Gambhir went to France with his family.


  • కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లిన గౌతం గంభీర్
  • వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్‌కు గౌతీ
  • తన కుటుంబంతో విమానాశ్రయంలో ఉన్న వీడియో వైరల్.
Gautam Gambhir: ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లిన టీమిండియా హెడ్ కోచ్..

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఫ్రాన్స్‌కు బయలుదేరాడు. తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అయితే.. గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో విమానాశ్రయంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి ఐపీఎల్‌లో అభిమానులు తమ అభిమాన మాజీ క్రికెటర్‌ను చూడలేరు. భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గంభీర్ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా అతను కీలక పాత్ర పోషించాడు. అతని మార్గదర్శకత్వంలో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు 2022, 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా సేవలు అందించారు. అయితే.. ఇప్పుడు భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో 2025 ఐపీఎల్ సీజన్‌లో అతని భాగస్వామ్యం ఉండదు.

గౌతమ్ గంభీర్ తన భార్య నటాషా.. కుమార్తెలు ఆజీన్, అనైజాలతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. భారత క్రికెట్ జట్టుతో నిరంతరం ప్రయాణిస్తున్న గంభీర్.. కొంత విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా పెద్ద విజయాలను సాధించింది. అతని శిక్షణలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 9న, న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గంభీర్ జట్టుకు నాయకత్వం వహిస్తూ 8 నెలలు పూర్తయ్యాయి. గంభీర్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సుదీర్ఘ పర్యటనలో కూడా పాల్గొన్నాడు. మరోవైపు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు గానూ.. భారత జట్టుకు రూ.58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తం ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక బృందం, అలాగే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీకి పంపిణీ చేయనున్నారు.