Leading News Portal in Telugu

Nitin Menon is the only Indian in the ICC Elite Panel of umpires 2025-26


  • ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్స్ జాబితా రిలీజ్
  • భారత్ నుంచి ఇద్దరికి చోటు
  • ఆరు సంవత్సరాలుగా ఎలైట్ ప్యానెల్‌లో నితిన్‌
ICC Elite Panel: ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్స్ జాబితా.. భారత్ నుంచి ఇద్దరికి చోటు!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ అంపైర్స్ జాబితా రిలీజ్ అయింది. 2025-26 సీజన్‌కు 12 మందితో కూడిన ఎలైట్‌ అంపైర్ల ప్యానెల్‌ జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్‌కు చెందిన నితిన్‌ మేనన్‌ తన స్థానాన్ని నిలుపుకున్నారు. జోల్‌ విల్సన్ (ట్రినిడాడ్‌), మైకెల్‌ గాఫ్‌ (ఇంగ్లండ్‌)లకు ప్యానెల్‌లో చోటు దక్కలేదు. ఈ ఇద్దరి స్థానాల్లో అలెక్స్‌ వార్ఫ్‌ (ఇంగ్లండ్‌), అలాహుద్దీన్‌ పాలేకర్‌ (దక్షిణాఫ్రికా)లకు ఐసీసీ చోటు కల్పించింది. మరోవైపు భారత్‌కు చెందిన జయరామన్‌ మదన్‌గోపాల్‌కు ఎమర్జింగ్‌ ప్యానెల్‌లో స్థానం దక్కింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన 41 ఏళ్ల నితిన్‌ మేనన్‌ ఆరు సంవత్సరాలుగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్నారు. 2019లో మొదటిసారి ఎలైట్ ప్యానెల్‌కు ఎంపికైనపుడు.. భారత్ నుండి ఎలైట్ ప్యానెల్‌లో భాగమైన మూడవ వ్యక్తిగా నిలిచారు. నితిన్ భారత దేశవాళీలో రెండు లిస్ట్ A మ్యాచ్‌లు ఆడారు. 2007లో 23 సంవత్సరాల వయస్సులోనే అంపైరింగ్ తన వృత్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 2017లో కాన్పూర్‌లో భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు పురుషుల విభాగంలో 30 టెస్టులు, 60 వన్డేలు, 50 టీ20ల్లో.. మహిళల విభాగంలో 20 టీ20ల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించారు.

ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌:
ధర్మసేన (శ్రీలంక), గఫానీ (న్యూజిలాండ్‌), హోల్డ్‌స్టాక్‌ (దక్షిణాఫ్రికా), రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌), కెటిల్‌బరూ (ఇంగ్లండ్‌), నితిన్‌ మేనన్‌ (భారత్‌), అల్లాహుద్దీన్‌ పాలేకర్‌ (దక్షిణాఫ్రికా), ఎహ్‌సాన్‌ రజా (పాకిస్థాన్‌), పాల్‌ రీఫిల్‌ (ఆస్ట్రేలియా), షాహిద్‌ (బంగ్లాదేశ్‌) రాడ్నీ టకర్‌ (ఆస్ట్రేలియా), అలెక్స్‌ వార్ఫ్‌ (ఇంగ్లండ్‌).