Leading News Portal in Telugu

బంగ్లాదేశ్ విజయం వెనుక ఉన్నది భారత్ మహిళే!

న్యూఢిల్లీ: మహిళ ఆసియా కప్ 2018లో భారత్ విజయపరంపరకు బంగ్లాదేశ్ జట్టు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన టీం ఇండియాను చిత్తుగా ఓడించి ఈ ఏడాది ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ ఎగిరేసుకుపోయింది. అయితే బంగ్లాదేశ్ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం వెనుక ఓ భారత మహిళ హస్తం ఉంది. ఒక రకంగా బంగ్లాదేశ్ జట్టు ఈ సిరీస్‌లో ఇంత అద్భుత ప్రదర్శన చేసేందుకు ఆ మహిళే కారణం. అమె ఎవరో కాదు బంగ్లాదేశ్ జట్టు కోచ్, మాజీ ఇండియా క్రికెటర్ అంజూ జైన్.

నెల రోజుల క్రితం కోచ్‌గా బాధ్యతలు మాజీ వికెట్‌కీపర్, బ్యాట్స్ ‌ఉమెన్ తన కోచింగ్‌తో బంగ్లాదేశ్ జట్టు భారత్‌ను ఈ సీజన్‌లో రెండుసార్లు చిత్తుగా ఓడించింది. అయితే కౌలాలంపూర్‌లో జట్టు విజయం తర్వాత అంజూ మాట్లాడుతూ..‘‘ఆసియా మహిళల్లో బంగ్లాదేశ్ జట్టు మొదటి స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన ఫాంలో ఉన్న టీం ఇండియా ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లను ఎదురుకునేందుకు ఎన్నో వ్యూహాలు రచించాం. మా ప్లేయర్లు కూడా ముందు అనుకున్న విధంగానే మా ప్లాన్‌లను సరిగ్గా అమలు చేశారు. మా తర్వాతి లక్ష్యం వెస్టిండీస్ వేదికగా జరిగే టీ-20 వరల్డ్ కప్‌కి అర్హత సాధించడమే’’ అని అన్నారు. ఈ సిరీస్‌లో అంజూకి మరో ఇద్దరు భారతీయ మహిళలు సహాయకంగా ఉన్నారు. అసిస్టెంట్ కోచ్‌గా దేవికా పాల్‌షికర్, ఫిజియోథెరిపిస్ట్‌గా అనూజా దాల్వీ వ్యవహరించారు. కాగా బంగ్లాదేశ్‌తో కలిసి పని చేసిన రెండు ఇండియన్ క్రికెటర్‌గా అంజూ నిలిచింది. గతంలో జట్టు మాజీ కెప్టెన్ మమత మబెన్ 2011-13 వరకూ బంగ్లాదేశ్ జట్టు ఇన్‌చార్జీగా ఉంది.