కీపర్ చెప్పినా.. కెప్టెన్ విశ్వసించలేదు
బెంగళూరు: భారత్తో బెంగళూరు వేదికగా గురువారం ఆరంభమైన చారిత్రక టెస్టు మ్యాచ్లో అఫ్గానిస్తాన్ జట్టు ఆదిలోనే వికెట్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ వఫాదర్ బౌలింగ్లో బంతిని డిఫెన్స్ చేసేందుకు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రయత్నించాడు. కానీ.. కొద్దిగా టర్న్ తీసుకున్న బంతి అతని బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ చేతుల్లో పడింది. దీంతో.. ఔట్ కోసం అతను అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.
బంతి కచ్చితంగా బ్యాట్ అంచున తాకిందని కీపర్ జజాయ్ చెప్పినా.. అఫ్గానిస్తాన్ కెప్టెన్ అస్గర్ అతడ్ని విశ్వసించలేదు. పక్కనే స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ షెజాద్ కూడా తనకు ఎలాంటి శబ్ధం వినిపించలేదని చెప్పడంతో.. అస్గర్ డీఆర్ఎస్ (రివ్వ్యూ) కోరలేదు. కానీ.. టీవీ రిప్లేలో బ్యాట్ అంచున బంతి తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో 10 ఓవర్లలో తొలి టెస్టు వికెట్ సాధించే అవకాశాన్ని అఫ్గానిస్తాన్ కోల్పోయింది.
అనంతరం మరింత దూకుడుగా ఆడిన ధావన్ కేవలం 47 బంతుల్లోనే 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా నిలకడగా ఆడుతుండటంతో.. 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది.