ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతిలో స్మార్ట్ఫోన్ లేని వారు లేరు. కొంత మంది దగ్గరయితే రెండు మూడు ఫోన్లను కూడా చూస్తుంటాం.. స్మార్ట్ఫోన్ అనేది మనిషి జీవితంలో కీలక సాధనంగా మారిపోయింది. ఇదే టైంలో ప్రతి పనీ కూడా ఇంట్లో నుంచే సులువుగా ఆన్లైన్లో చేసుకుంటున్నారు. ముఖ్యంగా.. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలని చూడటం.. వీడియోలు, సినిమాలు, గేమ్స్ ఆడటం వంటి అనేక పనులు చేస్తున్నారు. అయితే.. ఇటీవల ఒక ప్రముఖ పరిశోధన సంస్థ ఓ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఇండియన్స్ తమ స్మార్ట్ఫోన్ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారనే అంశాన్ని పరిశోధించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.
ఈ నివేదికలో.. 86 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా యుటిలిటీ పేమెంట్స్ చేస్తున్నట్లు చెప్పింది. అంటే కరెంట్ బిల్లులు, డిష్ బిల్లులు వంటివి. ఇది చాలా మంచి పద్ధతి దీనివల్ల టైం ఆదా అవుతుంది. అలాగే సుమారు 80.8శాతం మంది ప్రజలు తమ స్మార్ట్ఫోన్ల నుంచి ఆన్లైన్ షాపింగ్.. 61.8శాతం మంది ప్రజలు నిత్యావసర వస్తువులను ఆర్డర్.. దాదాపు 66.2శాతం మంది ప్రజలు తమ స్మార్ట్ఫోన్ల నుంచి ఆన్లైన్ సేవలని బుక్ చేసుకుంటున్నారు. దాదాపు 73.2 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్ఫోన్ల నుంచి కిరాణా వస్తువులను ఆర్డర్ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 58.3 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్ఫోన్ల నుంచి డిజిటల్ నగదు చెల్లింపులు చేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఇక.. స్మార్ట్ఫోన్లను ఉపయోగించే పురుషుల సంఖ్య మహిళల కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. దాదాపు 62 శాతం మంది పురుషులు స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నట్లు ఈ నివేదికలో తేలింది. కేవలం 38 శాతం మంది స్త్రీలు మాత్రమే స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారని వెల్లడించింది. అలాగే.. పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య కూడా తేడా ఉంది. పట్టణ ప్రజలలో 58 శాతం మంది స్మార్ట్ఫోన్లను వాడుతుంటే.. గ్రామీణ ప్రజల్లో 41 శాతం మంది మాత్రమే ఈ స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీనిని బట్టి స్మార్ట్ఫోన్ విప్లవం ఎంత వేగంగా డెవలప్మెంట్ చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.