Leading News Portal in Telugu

PhonePe Expands UPI Services to Feature Phone Users with New App Launch


PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

PhonePe: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (PhonePe) ఫీచర్‌ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జీఎస్‌ పే టెక్నాలజీకి చెందిన కన్వర్సేషనల్‌ ఎంగేజ్మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ ‘గప్‌ చుప్‌’ను ఫోన్‌పే ఇటీవలే కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

ఫోన్‌పే వెల్లడించిన ప్రకారం, రానున్న త్రైమాక్షికలో భారత్‌ లోని ఫీచర్‌ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూపీఐ మొబైల్‌ యాప్‌ ను విడుదల చేయనున్నది. ఈ యాప్‌ ద్వారా పీర్‌-టు-పీర్‌ (P2P) లావాదేవీలు, ఆఫ్‌ లైన్‌ క్యూఆర్‌ కోడ్ చెల్లింపులు, ఇతర యూపీఐ వినియోగదారుల నుండి మొబైల్‌ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఆధారంగా చెల్లింపులు స్వీకరించగలుగుతారు.

ఈ సేవలు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూపీఐ 123పే ఆధారంగా పనిచేసే జీఎస్‌ పే (GS Pay) టెక్నాలజీ ద్వారా అందించనున్నారు. ఫీచర్‌ ఫోన్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ టెక్నాలజీ ద్వారా యూపీఐ చెల్లింపులు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం నోకియా సంస్థ తయారు చేసిన కొన్ని ఫీచర్‌ ఫోన్లలో గప్‌ చుప్‌ యాప్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో ఎస్‌ఎంఎస్‌ ఆధారంగా బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ను అనుసంధానించొచ్చు. అనంతరం ‘పే’ ఆప్షన్‌ ద్వారా యూజర్లు యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబర్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇదే యాప్ స్థానంలో ఫోన్‌పే సరికొత్త యాప్‌ ను త్వరలో అందించనుంది.

స్మార్ట్‌ ఫోన్ల వినియోగదారులకే పరిమితంగా ఉండకుండా ఫోన్‌పే ఈ నిర్ణయం తీసుకున్నదాని వెనుక లక్ష్యం. ఫీచర్‌ ఫోన్ వాడుతున్న ప్రజలకు కూడా డిజిటల్‌ చెల్లింపు వేదికలను అందించడమే. ఈ మేరకు ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ సమీర్‌ నిగమ్ మాట్లాడుతూ.., “డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఒక కీలక అడుగని తెలిపారు. ఈ కొత్త యాప్‌తో ఫీచర్ ఫోన్ వినియోగదారులకూ యూపీఐ ఆధారిత చెల్లింపులు, లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.