Leading News Portal in Telugu

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఎక్కువ చెల్లించాల్సిందే

లాక్‌డౌన్ తర్వాత కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కువ ధర చెల్లించాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి కొత్త జీఎస్‌టీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా మొబైల్ షాప్స్ మూసేసి ఉన్నాయి. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ కూడా లేదు. దీంతో స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగాయన్న సంగతి యూజర్లకు తెలిసింది తక్కువే. కానీ మొబైల్ కంపెనీలు ధరల్ని పెంచేశాయి. ఇప్పటికే షావోమీ, రియల్‌మీ లాంటి కంపెనీలు కొత్త ధరల్ని ప్రకటించేశాయి. స్మార్ట్‌ఫోన్ ధరను బట్టి రూ.500 నుంచి రూ.1000 మధ్య ధర పెరిగింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడంతో కంపెనీలు ఈ ధర పెంచక తప్పలేదు.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. దీంతో కంపెనీలు వీలైనంత తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. అయితే జీఎస్‌టీ భారం పెరగడంతో కంపెనీలు ఇప్పుడు ధరలు పెంచక తప్పలేదు. లాభాల వాటాను తగ్గించుకునే పరిస్థితి లేకపోవడంతో కంపెనీలు ధరల్ని పెంచడం వైపే మొగ్గుచూపాయి. ఇప్పటికే కంపెనీలు కొత్త ధరల్ని తమతమ వెబ్‌సైట్స్‌లో అప్‌డేట్ చేశాయి. కానీ… ఆన్‌లైన్ సేల్, మార్కెట్‌లో షాప్స్ మూసేసి ఉండటంతో కొత్త రేట్స్ గురించి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తెలియట్లేదు. షావోమీ స్మార్ట్‌ఫోన్ల కొత్త ధరలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. రియల్‌మీ మొబైల్స్ కొత్త రేట్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.