Leading News Portal in Telugu

My India My LiFE Goals: వృక్షో రక్షతి రక్షితః.. కోటికి పైగా మొక్కలు నాటిన ది గ్రేట్ గ్రీన్ వారియర్ ‘వనజీవి’.. – Telugu News | Padmashri awardee 86 year old Tree Man Daripalli Ramaiah Green Warrior Inspirational Story


Green Warrior Inspirational Story: వృక్షో రక్షతి రక్షిత: (మానవ మనుగడ, సర్వజీవుల సుఖజీవనానికి వృక్షసంపదను రక్షించండి) అంటూ పచ్చదనానికి నిలువెత్తు రూపంగా మారారు.. ఆయన ఎవరో కాదు.. మన తెలుగు వ్యక్తి వనజీవి రామయ్య.. వయస్సు 86 ఏళ్లు.. ఇప్పటివరకు కోట్లాది మొక్కలు నాటి ఆయన అందరికీ ఆదర్శంగా మారారు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పదశ్రీ అవార్డుతో సత్కరించింది.

Daripalli Ramaiah – Green Warrior Inspirational Story: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. పర్యావరణాన్ని రక్షిస్తేనే మన భవిష్యత్తు.. లేకపోతే భావితరాలు ప్రశ్నార్థకమే.. మానవ మనుగడ కోసం పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం.. ఇలాంటి ఈ నినాదాలు తరచూ మనం వింటూనే ఉంటాం.. కానీ.. ఈ నినాదాలన్నింటికీ భిన్నంగా ఆయన ఓ ప్రత్యేక నినాదంతో పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించారు.. సింగిల్ మ్యాన్ అయినా.. వెనక్కి ఏమాత్రం తగ్గలేదు.. వృక్షో రక్షతి రక్షిత: (మానవ మనుగడ, సర్వజీవుల సుఖజీవనానికి వృక్షసంపదను రక్షించండి) అంటూ పచ్చదనానికి నిలువెత్తు రూపంగా మారారు.. ఆయన ఎవరో కాదు.. మన తెలుగు వ్యక్తి వనజీవి రామయ్య.. వయస్సు 86 ఏళ్లు.. ఇప్పటివరకు కోట్లాది మొక్కలు నాటి ఆయన అందరికీ ఆదర్శంగా మారారు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పదశ్రీ అవార్డుతో సత్కరించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య.. వయసు పైబడినా సరే.. సైకిల్ పై మొక్కలు తీసుకెళ్లి మరి నాటుతారు. ఇంకా వేసవి కాలంలో చెట్ల గింజలను సేకరించి.. వర్షాకాలంలో వాటిని విత్తుతారు. అందుకే ఆయన్ను వనజీవి రామయ్య.. చెట్ల రామయ్య అంటూ అందరూ.. ఆప్యాయంగా పిలుచుకుంటారు.

ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య దినచర్య మొత్తం మొక్కలతోనే.. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆయన దినచర్య మొక్కలు నాటడంతోనే ప్రారంభమవుతుంది.. మళ్లీ అదే మొక్కలతోనే ఆ రోజూ దినచర్య ముగుస్తుంది.. ఇంకా ఆయన నాటిన మొక్కలను అలా వదిలిపెట్టరు.. ఎంత దూరమున్న నీళ్లు పోసి మరి వాటిని పెంచుతారు. ఎవరు కనిపించినా మొక్కలు నాటితేనే మానవ మనుగడ.. లేకపోతే.. భవిష్యత్తు అంధకారమే.. అందుకే మొక్కలు నాటండి.. వృక్షో రక్షతి రక్షిత: అంటూ.. అవగాహన కల్పిస్తారు.

పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య సేవలను గుర్తించిన ప్రభుత్వం 2017లో కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇప్పటివరకు ఆయన కోట్ల మొక్కలను నాటారు. ఎప్పుడూ వనజీవి రామయ్య మొక్కల చరిత్రను చెబుతూ అవగాహన కల్పిస్తారు. సుమారు 120 రకాల మొక్కల చరిత్రను రామయ్య వివరిస్తారు.. రామయ్య చేసిన సేవలకు గానూ వనజీవి జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా.. రామయ్య ఐదో తరగతి వరకు చదువుకున్నారు.. అప్పట్లో ముత్తగూడెం స్కూల్లో టీచర్ మల్లేషం బోధించిన మొక్కల పెంపకం పాఠ్యాంశం రామయ్య జీవితాన్ని ప్రభావితం చేసింది.. కాగా.. 15వ ఏటనే రామయ్యకు జానమ్మతో పెళ్లి జరిగింది. వీరికి నలుగురు పిల్లలున్నారు. అయితే, రామయ్యతోపాటు.. జానమ్మ కూడా మొక్కలు నాటడం, పెంచడం.. ఖాళీ ప్రదేశాల్లో విత్తనాలు విత్తడం లాంటివి చేస్తుంటారు.

లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌ – లైఫ్‌.. పర్యావరణ హితం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఉద్యమంలో టీవీ9 భాగస్వామ్యంగా ఉన్నందుకు గర్విస్తోంది. మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌ పేరుతో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పర్యావరణ ఉద్యమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా టీవీ9 గ్రీన్ వారియర్స్ చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తూ.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది.



మరిన్ని జాతీయ వార్తల కోసం..