కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. కూకట్ పల్లి లో జరిగిన బీజేపీ భారీ బహిరగసభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కూకట్ పల్లి అంటే అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే గడ్డ అని ఆయన అన్నారు. బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అని, కూకట్ పల్లి ప్రాంతంలో బీజేపీ పటిష్టమైన శక్తిగా ఉందన్నారు. బీజేపీ పాలనలో దేశ ద్రోహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వము ఏవిధంగా పని చేస్తుందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏవిధమైన దోపిడీ జరిగిందో గమనించాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీది అవినీతి రహితమైన పాలన అని, గతంలో రిమోట్ ప్రధాన మంత్రి ఉండేవారని ఆయన అన్నారు.
తొమ్మిది ఏళ్లుగా సెలవు తీసుకోకుండా ప్రపంచంలో పని చేసిన ఏకైక ప్రధాని మోడీ అని ఆయన కొనియాడారు. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ యాక్టివిటీస్ ఎక్కడో అక్కడ జరిగేవి బీజేపీ ప్రభుత్వం వచ్చాక 9 సంవత్సరాలుగా సమర్థవంతగా పని చేసిన ప్రధాని మోడీ అని ఆయన అన్నారు. మన సైనికులు నిద్ర పోతుంటే పాకిస్తాన్ వాళ్ళు హతమార్చారని, మోడీ ఊరుకోలేదు వారిని ఏరి పారేశారన్నారు. ఉక్రెయిన్ లో విద్యార్థులను రష్యా తో మాట్లాడి యుద్ధం అపి తీసుకొచ్చారని, కరోనా సమయంలో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి, నెలకు 5కేజీల ఉచిత బియ్యం ఇచ్చిన చరిత్ర ప్రధాని మోడీది అని ఆయన అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి చేస్తున్నామని, కూకట్ పల్లి నుండి బాంబే రోడ్డుతో పాటు దేశంలో జాతీయ రహదారులు అత్యంత అద్భుతంగా వేశారన్నారు. కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతా అని ఫామ్ హౌస్ లో ఉండి కలలు కంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. అత్యంత అవినీతి కుటుంబం కేసీఅర్ కుటుంబమని, తెలంగాణ తెచ్చుకున్నది బానిసలు గా ఉండటానికి కాదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు, రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చారు కేసీఆర్.. కేటీఆర్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ అటకెక్కించారు. బీఅర్ఎస్ 30శాతం వాట ఇవ్వకుండా పని చేయడం లేదు అని కిషన్ రెడ్డి ఆరోపించారు.