Leading News Portal in Telugu

Vijayashanthi vs KCR: కేసీఆర్‌తో రాములమ్మ ఢీ..! ఇక అక్కడి నుంచే పోటీ..?


Vijayashanthi vs KCR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది.. ఏకంగా ఒకేసారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరింత హీట్‌ పెంచారు.. అయితే, ఈ సారి ఆయన రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగబోతున్నారు.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన ఆయన.. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డిలో కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ పోటీలో ఉండబోతున్నారు.. ఇదే సమయంలో.. బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు మాజీ ఎంపీ, సీనియర్‌ నేత విజయశాంతి అలియాస్‌ రాములమ్మ కూడా సిద్ధం అవుతున్నారట.. బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని ఆమె సోషల్‌ మీడియా వేదికగా సంకేతాలిచ్చారు.. ఆ అవకాశం తనకే కల్పించాలంటూ.. పార్టీ అధిష్టానానికి విజయశాంతి చెప్పినట్టుగా తెలుస్తోంది.

అయితే, ”కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది.. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే.. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం.. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత, బహుశా.. జై శ్రీరామ్.. హర హర మహాదేవ.. జై తెలంగాణ” అంటూ ట్వీట్‌ చేశారు విజయశాంతి. ఈ ట్వీట్‌తో చెప్పకనే కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చారనే చర్చ సాగుతోంది..

కాగా, గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు విజయశాంతి.. కానీ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు.. ఆ తర్వాత కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌లో తన పార్టీని విలీనం చేశారు రాములమ్మ.. ఆ తర్వాత తనకు పార్టీలో తగినంత ప్రాధాన్యత దక్కడంలేదంటూ రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.. ఇక, కాంగ్రెస్‌ పార్టీలోనూ పనిచేశారు విజయశాంతి.. అక్కడ కూడా ఇమడలేక.. చివరకు మళ్లీ బీజేపీలోకి వచ్చేశారు.. తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందనే కామెంట్‌ కూడా చేశారు. కానీ, కేసీఆర్‌తో ఆ నాటి నుంచీ రాజకీయ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. రాజకీయంగా ఇప్పటికీ కేసీర్‌ను ప్రత్యర్థిగానే భావిస్తున్న రాములమ్మ.. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ సర్కార్‌పై, సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.. ఇక, సోషల్‌ మీడియాలో.. యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు.. కొడితే పెద్ద తలకాయనే కొట్టాలన్నట్టుగా కేసీఆర్‌పై పోటీకి రెడీ అవుతున్నారట రాములమ్మ. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూసిన ఆమె.. ఆయన విధానాలను ఎండగట్టడం తనకు చాలా ఈజీ అంటున్నారట.

ఈ సారి కేసీఆర్‌ ఎంచుకున్న కామారెడ్డి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారట విజయశాంతి.. దీంతో, అగ్రనేతలు పోటీ చేసే స్థానాలపై ఆయా పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక విషయంపై తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కేసీఆర్‌పై, విజయశాంతి పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ విషయాన్ని పరోక్షంగా దృవీకరిస్తూ.. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డి నుండి పోటీకి రెడీ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.. ఇక, బీజేపీ కూడా విజయశాంతికి ఆ స్థానం నుంచే బరిలో దింపేలా ప్లాన్‌ చేస్తుందని సమాచారం.. ఎన్నికల్లో గెలుపోటముల మాట ఎలా ఉన్నా.. ఈ ఎన్నికల్లో బడా లీడర్ల మధ్య పోటీ.. పొలిటికల్‌ హీట్‌ పెంచబోతోంది. మరి.. కేసీఆర్‌ పోటీ చేస్తున్న ఆ రెండు స్థానాల నుంచి బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుంది.. రాములమ్మను నిజంగానే కామారెడ్డిలో పోటీకి పెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం రాములమ్మ సొంతం.. ఈ మధ్యే తాను రాజకీయాల్లో వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. “నాది పదవుల ప్రయాణ రాజకీయ జీవితం కాదు. దైవాన్ని విశ్వసించే అంతఃకరణ, తరాల తెలంగాణ ప్రజల కష్టాలు చూసి చలించి, ఉద్యమించే మనో ప్రేరణ … రెంటి సమాహారం. ఇది బహుశా తీవ్రమైన నా సంఘర్షణా భరిత 25 సంవత్సరాల రాజకీయ పయనం కావచ్చు.. అయితే, బీజేపీ అంటే, నేను విశ్వసించే అంతఃకరణ నమ్మకం, తెలంగాణ అంటే ఆ విశ్వాసం, నమ్మకాలను మించిన నా ప్రజా ప్రయాణం. కానట్లయితే, 2005ల నేను, బీజేపీని వదిలి తెలంగాణ ఉద్యమ బాట పట్టి ఉండకపోవచ్చు. బీజేపీపై NDA భాగస్వామ్య ఒత్తిడి వల్ల, నాడు ఆత్మగౌరవ తెలంగాణా ఒక్క అంశం కాకుంటే, నేను 1998 నుండి 2005 వరకూ దేశమంతా పనిచేసిన నా బీజేపీని నాడు ఎందుకు దూరం చేసుకోవాల్సి వస్తది? నేడు కొంతమంది బీజేపీ వ్యతిరేక మీడియా నా పైన చెప్తున్నట్లు, ఆ రెంటి మధ్య భవిష్యత్ ఘర్షణ… బహుశా వారి ఊహాగాన సృష్టిత అవాస్తవం” అంటూ ట్వీట్‌ చేశారు. 25 రాజకీయాలు చూసిన ఆమె.. ఈ సారి ఎలాగైనా చట్టసభల్లో అడుగుపెట్టాలన్న సంకత్పంతో ఉన్నారు. సినీ రంగంలో ఓ వెలుగువెలిగిన ఆమె.. లేడీ అమితాబ్‌గా ఓ ఫైర్ బ్రాండ్.. లేడీ సూపర్ స్టార్‌గా కొన్నేళ్ల పాటు వెండితెర మీద చెరగని ముద్రవేశారు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తాను ఓ ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకున్నారు.. ఎంపీగా తన సేవలు అందించారు.. ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.. మరి. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచిచూడాలి.