Leading News Portal in Telugu

Telangana BJP: ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోండి.. కౌంటర్‌ ఓపెన్‌ చేసిన బీజేపీ


Telangana BJP: తెలంగాణలో ఎన్నికల హీట్‌ పెరిగిపోతోంది.. ఓవైపు జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్నా.. మరోవైపు.. ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చు అనే ఉత్కంఠ నెలకొంది.. ఇక, ఒకే సారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మరింత హీట్‌ పెంచారు బీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది.. దరఖాస్తుల స్వీకరించింది.. పోటీపడుతున్న ఆశావహుల పరిస్థితులను బేరీజు వేసి ఓ లిస్ట్‌ అధిష్టానికి పంపింది.. ఇక, ఎప్పుడైనా.. కాంగ్రెస్‌ అధిష్టానం ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటిస్తుందనే చర్చ సాగుతోంది. మరోవైపు.. బీజేపీకి కూడా అభ్యర్థుల ఎంపికకు సిద్ధమవుతోంది.. దీని కోసం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసింది.

ఇవాళ్టి నుంచి అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తోంది బీజేపీ.. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అయితే, ముఖ్యనేతలు దరఖాస్తు చేసుకుంటారా..? చేసుకుంటే ఏ నియోజక వర్గం నుండి అనేది ఆసక్తికరంగా మారగా.. మూడు పేజీల్లో అప్లికేషన్ ఫార్మ్ ట్‌ రూపొందించారు. పార్ట్ 1లో అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు.. పార్టీలో ఎప్పుడు చేరారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పార్ట్ 2లో గతంలో పోటీ చేస్తే ఆ వివరాలు పొందుపర్చాలి.. పార్ట్ 3లో ప్రస్తుతం పార్టీలో ఉన్న బాధ్యతలు.. పార్ట్ 4లో ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే.. ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. మొత్తం మూడు పేజీలతో కూడా ఫారమ్‌ నింపి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇంఛార్జిలుగా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ తదితరులను నియమించింది బీజేపీ.