తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. హైదరాబాద్తో పాటు తెలంగాణను ఊపేసిన వర్షం ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ వర్షాలు దంచికొడతాయని అధికారులు చెబుతున్నారు. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి..
కాస్త ఆగిన వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. ముఖ్యంగా సిద్ధిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు పైన పేర్కొన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది…
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికి పలు చోట్ల రోడ్లన్నీ నీటి మయం అయ్యాయి.. కాలు తీసి బయట పెట్టడానికి వీలు లేకుండా పోయింది.. తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వికారాబాద్, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక హైదరాబాద్లో చుట్టు పక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలయాశాలు వరద నీటితో నిండిపోయాయి.. డ్యామ్ లలో నీటిని వదులుతున్నారు.. ఇక మరోసారి భారీ వర్షాలంటే జనం భయపడుతున్నారు.. ఏది ఏమైనా వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..