ఈరోజు భారతదేశంలో అతి ఎక్కువ ఎంబిబిఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు మంత్రి హరీష్ రావు. 15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీ ల ప్రారంభంపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి లక్ష జనాభా కి 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ ఆగ్రస్థానంలో ఉంది. 2014లో ఈ విషయంలో చిట్ట చివరి స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు అగ్రస్థానంలోకి చేరిందని వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే కనీసం ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని ఆయన మండిపడ్డారు.
మరోవైపు 50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వలన నిజామాబాద్, ఆదిలాబాద్ లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని, మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య కోసం పక్క రాష్ట్రాల నుంచి మొదలుకొని ఉక్రెయిన్ , రష్యా వంటి విదేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడి చదువుకునేవారన్నారు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ పిల్లలు తెలంగాణ రాష్ట్రంలోని ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని కల్పించారని, కొత్త మెడికల్ కాలేజీలో ఏర్పాటు వలన అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకి వివరించాలన్నారు హరీష్ రావు. రాష్ట్రం వచ్చిన రోజు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లలో 43% తెలంగాణ రాష్ట్రంలోనే పెరిగాయన్నారు హరీష్ రావు.