Leading News Portal in Telugu

Kaloji Son: కాళోజీ నారాయణరావు తనయుడు రవికుమార్‌ మృతి


ప్రజాకవి కాళోజీ నారాయణరావు తనయుడు రవికుమార్‌ కన్నుమూశారు. హన్మకొండ జిల్లాలోని దామెర మండల శివారులోని ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో నిన్న (ఆదివారం) ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య వాణీదేవి, కుమారుడు సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. అయితే, రవికుమార్ కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నారు. రవి కుమార్ అనారోగ్యం రీత్యా ఇటీవలే హన్మకొండకు వచ్చారు. రవికుమార్‌ నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.

అయితే, రవి కుమార్ కొంతకాలం ఆంధ్రా బ్యాంక్‌లో ఉద్యోగం చేసి, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. సాహిత్యం అంటే మక్కువే.. కాళోజీ స్థాపించిన మిత్రమండలిలో ఆయన సభ్యుడిగా ఉంటూ దాదాపు అన్ని సమావేశాలకు హాజరయ్యేవారు. రవికుమార్‌ మృతిపై కాళోజీ ఫౌండేషన్‌ పక్షాన నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్‌ విద్యార్థి, అంపశయ్య నవీన్‌ తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నేడు (సోమవారం) ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక, రవి కుమార్ భౌతికకాయాన్ని హన్మకొండలోని నక్కలగుట్టలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా, కాళోజీ కుమారుడు రవికుమార్‌ మృతి చెందడం బాధాకరమని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రవికుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.