హైదరాబాద్లో హిమాయత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దుం భవన్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చడా వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసిందన్నారు. ఏడాది కాలం పాటు సాయుధ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని ఆయన వెల్లడించారు. పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు అయితే చరిత్రను వక్రీకరించి ప్రయత్నం జరిగిందన్నారు కూనంనేని. రైతాంగ పోరాట అమర వీరుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.
అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చడా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో అధికారంలోకి వస్తే విలీన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుడన్నారు. ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసు అని ఆయన అన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ … రైతాంగ సాయుధ పోరాట అమరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు.