Leading News Portal in Telugu

Minister KTR: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి..


తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ. 350 కోట్లు పెట్టుబడిని పెట్టనుంది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం దాదాపు రూ. 350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్, ఇతర పరికరాలను తయారు చేయనున్నారు.

ఈ కంపెనీ తయారీ ప్లాంట్ శంఖుస్థాపన కార్యక్రమం సెప్టెంబర్ 28న చేయనున్నారు. వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా, మంత్రి కేటీఆర్ హజరుకానున్నారు. ఇప్పటికే.. తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టి సక్సెస్ ఫుల్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్ స్పన్ గ్రూప్ తెలంగాణలో మరింతగా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో అదనంగా దాదాపు 350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నందుకు కంపెనీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల కల్పనే.. అనేక నూతన పెట్టుబడులను రాష్ట్రానికి తరలి వచ్చేలా చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కార్యకలాపాలను, తమ పెట్టుబడులను విస్తరించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తెలుసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.