Leading News Portal in Telugu

Election Commission: అక్టోబరు 3న తెలంగాణకు ఎలక్షన్ కమిషన్ రాక


తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బృందం అక్టోబర్‌ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇక, ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో సీఎస్‌ శాంతి కుమారి.. సచివాలయంలో నేడు (శుక్రవారం) అధికారులో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి సన్నద్ధతను ఎలక్షన్ కమిషన్ కు వివరించాలని ఆమె చెప్పారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నందున పోలింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సూచించారు. అన్ని వివరాలను అందించాలని క్లారిటీ ఇచ్చారు.

అయితే, అదే విధంగా పోలింగ్‌ కేంద్రాల్లో కల్పించనున్న కనీస వసతుల వివరాలు ఇవ్వాలని సీఎస్‌ శాంతికుమారి చెప్పారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్‌ ఛైర్లను సమకూర్చుకొని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి అని ఆమె అన్నారు. ఏఈఆర్ఓ, ఈఆర్ఓ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు తెలిపింది. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు అందించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అదేశించారు.