హైదరాబాద్ దోమలగూడలో 20 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఫిజికల్ ఎడ్యుకేషన్ బాలికల వసతి గృహా సముదాయం భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. దోమలగూడలోని వ్యాయామ కళాశాలలో 20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన హాస్టల్, అడ్మినిస్ట్రేషన్, అకడమిక్ భవన సముదాయ పనులకు సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్, వెల్ఫేర్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ దేవికారాణి, కళాశాల ప్రిన్సిపాల్ కె.రాంరెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దే స్థాయికి వ్యాయామ విద్య కోచింగ్ కళాశాల ఎదగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 20 కోట్ల కేటాయించడంపై ఆమె ధన్యవాదాలు తెలిపారు… భవన నిర్మాణానికి అదనపు నిధులు అవసరమైన ప్రభుత్వం తరఫు నుండి అందించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 9సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెనుమార్పులు తెచ్చారని ఆమె అన్నారు. దేశంలోనే విద్యారంగంలో తెలంగాణ వైపు చూసేవిధంగా విద్యాశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ… అనేక నిధులు కేటాయిస్తున్నారని మంత్రి సబితా అన్నారు. రాష్ట్రంలో ప్రతి పక్షాలకు దిమ్మతిరిగే రీతిలో కేసీఆర్ పాలన ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తారని వివరించారు.