బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజం… మోడీ ఆశీస్సులతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది నిజం అని అన్నారు.
ఇప్పటికీ మోడీ, కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజం నిప్పులాంటిది.. ఎప్పటికైనా నిగ్గుతేలక మానదు అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని.. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. గడిచిన 9 ఏళ్లలో మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్ మద్ధతు ఉన్నదన్నది పార్లమెంట్ రికార్డులే చెబుతాయని రేవంత్ గుర్తు చేశారు.
కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చీకట్లో మోడీతో ఏయేం లాలూచీలు పడ్డాడో మోడీనే చెప్పిన తర్వాత ఇక వారిద్దరి అనుబంధం – బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని… సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదని రేవంత్ అన్నారు. తెలంగాణ సమాజం జాగురుకతతో ఉండి.. ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తెరిగి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.