తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభించనుండటంతో రాష్ట్రంలో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు జరుతున్నాయి. మరికొన్ని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయులు చేసుకుంటున్నాయి. బెంగళూరు కంటే హైదరాబాద్ అనుకూలమని ఆయా సంస్థలు రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల విదేశీ పర్యటనతో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహద పడుతున్నాయి.
అయితే, తెలంగాణ రాష్ట్రానికి మరో సంస్థ రావడానికి రెడీ అయింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రముఖ కెయిన్స్టెక్ కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ( ఎక్స్ ) అకౌంట్లో పోస్టు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఎంవోయూ కుదుర్చుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను మంత్రి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఇక, తెలంగాణలో అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, కంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు కెయిన్స్టెక్ సంస్థ వెల్లడించింది. కెయిన్స్ టెక్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీంతో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రంలో పెట్టుపడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కెయిన్స్టెక్ కంపెనీని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఫాక్స్ కాన్, కార్నింగ్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థల తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.