తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీచర్ల తరపున దాఖలైన పిటిషన్ను నేడు (శుక్రవారం) జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించగా.. వాదనలు విన్న జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. టీచర్ల బదిలీ ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, రంగారెడ్డి జిల్లాలో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులుండటంతో పాటు పదోన్నతులపై స్టే ఉండటంతో రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై రంగారెడ్డి టీచర్లు కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం బదిలీలపై స్టే విధించింది. అయితే, తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. రెండు మల్టీజోన్లలో పదోన్నతులను పక్కన పెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులు, పదోన్నతులపై స్టే ఉండటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 3 నుంచి 8 వరకు బదిలీల ప్రక్రియ జరుగనుంది. ఈ మేరకు అక్టోబరు 3న బదిలీలకు సంబంధించిన షెడ్యూలును రిలీజ్ చేసింది. అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్ఆప్షన్కు ఛాన్స్ ఇచ్చింది. అక్టోబరు 8న వెబ్ ఆప్షన్ల సైతం ఎడిట్ చేసుకునే వీలు ఇచ్చింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లో ఎలాంటి మార్పులుండవని విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా టీచర్ల బదిలీలను అక్టోబర్ 19 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.