Leading News Portal in Telugu

Kasireddy Narayan Reddy: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి కసిరెడ్డి.. కండువా కప్పిన ఖర్గే


బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చేరారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నాతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఇతర నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కాంగ్రెస్ లో చేరారు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం లేకుండా పోవాలని యువత కోరుకుంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి ఉన్నా.. లేకున్నా కల్వకుర్తి మాత్రం అభివృద్ధి జరగడం లేదు.. ప్రాజెక్ట్ కు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదు.. భూ సమీకరణకు ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు అని కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

పెద్ద మొత్తం కూడా కాదు.. ఎన్నో సార్లు అడిగాం అని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. భూములు పోయాయి, ఆ కాలువ ద్వారా నీళ్లు రాలేదు.. భూములు కోల్పోయిన రైతులకు రైతుబంధు రావడం లేదు.. నేను 10వ తరగతి చదువుకున్న స్కూల్లో జూనియర్ కాలేజీ నడుస్తోంది.. డిగ్రీ కాలేజీ లేదు.. ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కల్వకుర్తికి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది అని ఆయన చెప్పారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేకు మాత్రమే ప్రాధాన్యత ఉంది.. నేను అక్కడ ఒక అసహాయ నేతగా మిగిలిపోయాను.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చింది అని కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు పనికొస్తాయని నేను నమ్ముతున్నాను అని కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను.. నన్ను ప్రజలు తీసుకొచ్చారు.. గెలిపించుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉంది.. కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నా ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా పని చేస్తాను అంటూ ఆయన వెల్లడించారు.