Leading News Portal in Telugu

Telangana BJP: నేడే టీ.బీజేపీ తొలి జాబితా… 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లు..?


Telangana BJP: నేడే టీ.బీజేపీ తొలి జాబితా… 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లు..?

Telangana BJP: ఎట్టకేలకు నేడు టీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు తుది దశకు చేరుకుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గురువారం సమావేశమయ్యారు. అనేక సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధాన నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా సీట్ల కేటాయింపు, మెజారిటీ ప్రజలు టికెట్ ఆశిస్తున్న స్థానాలు… వీటిపై చర్చ జరిగింది. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పలుమార్లు కలిశారు. ఈ సమావేశాల అనంతరం గురువారం రాత్రి నడ్డా నివాసంలో కమిటీ మరోసారి సమావేశమైంది.

ఈ సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. తెలంగాణలో పోటీ చేసే అన్ని స్థానాలపై కోర్ కమిటీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. అయితే శుక్రవారం ఉదయం 11 గంటలకు నడ్డాతో మరోసారి భేటీ కానున్నారు. ఆ తర్వాతే తుది జాబితా సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఇవాళ (శుక్రవారం) సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి జాబితాను పంపనున్నారు. ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా, లక్ష్మణ్, ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ అభ్యర్థుల ఎంపికపై చర్చించి తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లపై మరింత కసరత్తు చేయాల్సి ఉంది. దీన్ని బట్టి తొలి దశ జాబితాలో తెలంగాణలోని 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Rahul Gandhi: కొండగట్టు సందర్శన వాయిదా.. నేరుగా ఆర్ముర్ కి రాహుల్..