Leading News Portal in Telugu

Bandi Sanjay : కరీంనగర్‌లో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్


Bandi Sanjay : కరీంనగర్‌లో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7నుండి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు, ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ లోని 24వ డివిజన్ లో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

ఒకవైపు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతోపాటు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బండి సంజయ్ కు పార్టీ ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.. అందులో భాగంగా ఈనెల 8, 9, 10వ తేదీల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై షెడ్యూల్ ను రూపొందించింది. తొలిరోజు సిరిసిల్ల, నారాయణపేట, మరుసటి రోజు ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. దీంతోపాటు బండి సంజయ్ భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారుకు అనుమతిచ్చింది. మరోవైపు బండి సంజయ్ కుమార్ ఈనెల 6న బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయనున్నారు.