
Pawan Kalyan: సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జల్, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమమని.. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి నెలకొందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అన్నదే ప్రశ్న అంటూ పవన్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగించారు.
మోడీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదన్నారు. ఎన్నికలనే మోదీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదన్నారు. ఎన్నికలనే మోడీ దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. దేశ ప్రయోజనాలే ప్రధాని మోడీని నిర్ధేశిస్తాయి తప్పు, ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. బీసీలను సీఎం చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా భారత్ను అగ్రగామిగా నిలబెట్టింది మోడీ అని పవన్ వెల్లడించారు. ప్రతి భారతీయుడి గుండెలో ధైర్యం నింపిన నేత మోడీ అంటూ కొనియాడారు.
నాలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారని.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం కష్టమన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. బీజేపీకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి అండగా నిలబడతామన్నారు. భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం కాకూడదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉగ్రదాడులు తగ్గిపోయాయన్నారు.