
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు. కుత్బుల్లాపూర్ లో ఏ సమస్యలు ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన సమిష్టిగా పోరాడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు.. దేశానికి మోడీ లాంటి బలమైన నాయకత్వం కావాలని పవన్ కల్యాణ్ తెలిపారు. తన మిత్రుడు శ్రీశైలంను ఎమ్మెల్యేగా గెలిపించాలని.. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీసీ ముఖ్యమంత్రి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. కాగా.. నరేంద్ర మోడీకి ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు ఓటేసినట్టే పవన్ కల్యాణ్ అన్నారు. కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ కు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు, జనసేనకు వేసినట్టేనన్నారు. దేశంలో ఉగ్రదాడులు జరగకుండా బలంగా నిలబడిన పార్టీ బీజేపీ చెప్పారు. నరేంద్ర మోడీ లాంటి ఒక బలమైన నాయకత్వంలో దేశం ప్రగతిపథాన నడుస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.