Leading News Portal in Telugu

Minister Niranjan Reddy: 2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం


Minister Niranjan Reddy: 2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం

Minister Singireddy Niranjan Reddy: 2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ పట్టవన్నారు. నాడు తెలంగాణను ఎండబెట్టి సర్వనాశనం చేసిందన్నారు. నేడు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నదని.. తాత్కాలికంగా కాంగ్రెస్ రైతుబంధును అడ్డుకోగలదేమో .. డిసెంబరు 3 తర్వాత అడ్డుకోలేదన్నారు. నిస్సిగ్గుగా కాంగ్రెస్ రాజకీయాల కోసం అవరోధాలు సృష్టిస్తున్నదన్నారు. వ్యవసాయరంగాన్ని నిలబెట్టాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే తొలిసారి రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కోటి 50 లక్షల ఎకరాలకు 11 విడతలుగా రైతుబంధు అమలుచేస్తున్నామన్నారు.

తెలంగాణలో వ్యవసాయం స్థిరపడ్డదని, బలపడ్డదని.. ఎన్నికల కోసం రైతులు వ్యవసాయం అపలేరు .. రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఒక నేత రైతుబంధు ఎందుకు అంటారని.. మరొకరు 24 గంటల కరెంటు ఎందుకు అంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో తెలంగాణ వ్యవసాయం మీద, తెలంగాణ రైతుల మీద కక్ష్య కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు పథకాలను ఆపగలరేమో కానీ ప్రజలు ఎన్నుకునే కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేరన్నారు. రైతులకు రైతుబంధు అందకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలపై నిప్పులు చెరిగారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

పనుల కాలంలో కూడా ఇంత మంది రావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. 2018లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యి మంత్రిని అయ్యానన్న నిరంజన్‌ రెడ్డి.. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 12 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికంటే ఎక్కువగా చేశానన్నారు. నర్సింగాయిపల్లి వనపర్తికి బంగారు తునక అని, పాత పట్టణం అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో మాత శిశు సంరక్షణ కేంద్రం, పీజీ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఆర్టీవో కార్యాలయం సైతం ఇక్కడ ఏర్పాటు కానుందన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం కావడంతో ప్రైవేటు సంస్థలు అనేకం ఇక్కడకు వచ్చాయని, దీనివల్ల చాలా మందికి అనేక పనులు దొరుకుతున్నాయన్నారు. కారు గెలిస్తే నియోజకవర్గం ప్రజలందరూ గెలుస్తారన్నారు. రూ.2 వేల పింఛన్ 5 వేలు అవుతుందని, పింఛన్ లేని అర్హులైన మహిళలకు సౌభాగ్య లక్ష్మి, గృహలక్ష్మి పథకం కింద అందరికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.